ఇది శాసనసభ కాదు.. కౌరవ సభ: చంద్రబాబు

  • అసెంబ్లీలో టీడీపీ సభ్యులపై దాడిని ఖండించిన చంద్రబాబు
  • జగన్ ప్రోద్బలంతోనే వైసీపీ ఎమ్మెల్యేలు దాడికి దిగారని ఆరోపణ
  • తదుపరి కార్యాచరణపై చర్చించేందుకు కాసేపట్లో ఎమ్మెల్యేలతో సమావేశం
సీఎం జగన్ ప్రోద్బలంతోనే అసెంబ్లీలో సోమవారం తమ పార్టీ సభ్యులపై దాడి జరిగిందని టీడీపీ అధినేత చంద్రబాబు ఆరోపించారు. ‘‘అసెంబ్లీ చరిత్రలో ఇవాళ చీకటి రోజు. సీఎం జగన్ ప్రోద్బలంతోనే దళిత సభ్యుడు డోలా బాల వీరాంజనేయ స్వామిపై దాడి చేశారు. చట్టసభలకు మచ్చ తెచ్చిన వ్యక్తిగా జగన్ నిలిచిపోతారు. వైసీపీ సిద్ధాంతమేంటో ప్రజలకు పూర్తిగా అర్థమైంది. ఇది శాసనసభ కాదు.. కౌరవ సభ’’ అంటూ అధికార పార్టీపై టీడీపీ అధినేత మండిపడ్డారు. 

జీఓ నెం.1 రద్దు కోసం స్పీకర్ పోడియం వద్ద నిరసన తెలుపుతున్న టీడీపీ ఎమ్మెల్యేలు డోలా బాల వీరాంజనేయ స్వామి, గోరంట్ల బుచ్చయ్య చౌదరిపై వైసీపీ ఎమ్మెల్యేలు  దాడి చేశారని టీడీపీ సభ్యులు ఆరోపిస్తున్నారు. ఇదిలా ఉంటే.. సోమవారం అసెంబ్లీలో జరిగిన ఘటనపై చర్చించేందుకు టీడీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పార్టీ అధినేత చంద్రబాబుతో సమావేశం కానున్నారు. తదుపరి ఏం చేయాలనే విషయమై చర్చించనున్నారు.

Chandrababu
AP Assembly Session
Jagan

More Telugu News